కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ అధ్యాయం

వాళ్లు దుష్ట పరిపాలకుని నుండి తప్పించుకున్నారు

వాళ్లు దుష్ట పరిపాలకుని నుండి తప్పించుకున్నారు

మత్తయి 2:13-23

  • యేసు కుటుంబం ఐగుప్తుకు పారిపోయింది

  • యోసేపు తన కుటుంబాన్ని తీసుకుని నజరేతుకు వెళ్లాడు

యోసేపు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మరియను నిద్రలేపాడు. కాసేపటి క్రితమే యెహోవా దూత అతనికి కలలో కనిపించి ఇలా చెప్పాడు: “నువ్వు లేచి పిల్లవాణ్ణి, తల్లిని తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను చెప్పేంతవరకు అక్కడే ఉండు. ఎందుకంటే పిల్లవాణ్ణి చంపాలని హేరోదు ఆయన కోసం వెదకబోతున్నాడు.”—మత్తయి 2:13.

రాత్రికిరాత్రే యోసేపు మరియలు తమ పిల్లవాణ్ణి తీసుకుని అక్కడినుండి వెళ్లిపోయారు. వాళ్లు సరైన సమయంలో తప్పించుకున్నారు. ఎందుకంటే, జ్యోతిష్యులు తనను మోసం చేశారని హేరోదుకు తెలిసిపోయింది. పిల్లవాణ్ణి చూసిన తర్వాత తన దగ్గరికి వచ్చి చెప్పమని హేరోదు జ్యోతిష్యులతో అన్నాడు. కానీ వాళ్లు అలా చెప్పకుండానే తమ దేశానికి వెళ్లిపోయారు. దాంతో హేరోదుకు చాలా కోపం వచ్చింది. యేసును ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో బేత్లెహేము, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండేళ్లు, అంతకన్నా తక్కువ వయసున్న మగపిల్లలందర్నీ చంపమని ఆదేశించాడు. తూర్పు నుండి వచ్చిన జ్యోతిష్యులు చెప్పిన వివరాల్ని బట్టి అతను యేసు వయసును ఊహించివుంటాడు.

మగపిల్లలందర్నీ చంపించడం ఎంత దారుణం! ఆ సందర్భంలో ఎంతమంది మగపిల్లలు చంపబడ్డారో మనకు తెలీదు. కానీ వాళ్ల తల్లుల ఏడ్పు, రోదన యిర్మీయా ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చాయి.—యిర్మీయా 31:15.

యోసేపు, అతని కుటుంబం ఐగుప్తుకు చేరుకొని అక్కడ నివసించారు. ఒక రోజు రాత్రి యెహోవా దూత మళ్లీ యోసేపుకు కలలో కనిపించి, “నువ్వు లేచి పిల్లవాణ్ణి, తల్లిని తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్లు. ఎందుకంటే పిల్లవాని ప్రాణం తీయాలని చూసినవాళ్లు చనిపోయారు” అన్నాడు. (మత్తయి 2:20) దాంతో యోసేపు తన కుటుంబాన్ని తీసుకుని తన దేశానికి తిరిగెళ్లాలని అనుకున్నాడు. అలా, దేవుని కుమారుడు ఐగుప్తు నుండి పిలవబడ్డాడు అనే మరో బైబిలు ప్రవచనం నెరవేరింది.—హోషేయ 11:1.

బహుశా యూదయలోని బేత్లెహేము పట్టణం దగ్గర్లో స్థిరపడాలని యోసేపు అనుకొనివుంటాడు. ఐగుప్తుకు పారిపోకముందు అతను తన కుటుంబంతో నివసించింది అక్కడే. కానీ హేరోదు స్థానంలో, చెడ్డవాడైన అతని కుమారుడు అర్కెలాయు యూదయను పరిపాలిస్తున్నాడని యోసేపుకు తెలిసింది. అంతేకాదు, పొంచివున్న ప్రమాదం గురించి దేవుడు మరో కలలో యోసేపును హెచ్చరించాడు. అందుకే, అతను తన కుటుంబాన్ని తీసుకొని యెరూషలేముకు దూరంగా, ఉత్తరాన ఉన్న గలిలయ ప్రాంతంలోని నజరేతు నగరంలో స్థిరపడ్డాడు. యేసు అక్కడే పెరిగి పెద్దయ్యాడు. అలా, “ఆయన ఒక నజరేయుడు అని పిలవబడతాడు” అనే మరో ప్రవచనం నెరవేరింది.—మత్తయి 2:23.